top of page

శ్రీమద్రామాయణం – అయోధ్యకాండ – 95,96,97

*శ్రీమద్రామాయణం* * *అయోధ్యకాండ – 95* *[హతొ అస్మి యది మాం ఎవం భగవాన్ అపి మన్యతె |* *మత్తొ న దొషం ఆషంకెర్ న ఎవం మాం అనుషాధి హి ||]* ఈ మాటలు విన్న భరతుడు కన్నీరు కారుస్తూ “మహానుభావా! నా దౌర్భాగ్యమయ్యా! నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను చూసి రాముడిని చంపడానికి వచ్చావా? అంటున్నారు. నేను రాముడిని చంపడానికి రాలేదు. నువ్వు అడిగిన ప్రశ్న చేత నేను చచ్చిపోయాను మహర్షీ! ఈ మాట గుహుడు అడిగాడంటే అర్థం చేసుకోవచ్చు. కానీ ఇంత గొప్ప మహర్షులు మీరు కూడా ఈ మాట అన్నారంటే నేను బ్రతకడం ఎందుకు? నేను ఎన్నడూ రాజ్యం కావాలని, నా అన్న రాముడు అరణ్యవాసం చెయ్యాలని కోరలేదు. కానీ నా మీద ఉన్న విపరీతమైన ప్రేమ చేత మా అమ్మ నేను లేనప్పుడు రెండు వరాలు అడిగింది. రాముడికి పట్టాభిషేకం చేయించాలని అరణ్యానికి వచ్చాను. నేను రాముడిని చంపేంత దుర్మార్గుడిని కాదు మహర్షీ!” అని ఆయన పాదముల మీద పడి ఏడ్చాడు. అప్పుడు భారద్వాజుడు “నువ్వు ఎటువంటివాడివో నాకు తెలుసు భరతా! నువ్వు ఇటువంటి దురాలోచనలు చెయ్యవని తెలుసు. అయినా నేను నిన్ను ఎందుకడిగానో తెలుసా? నీ శీలం ఎటువంటిదో లోకానికి చెప్పడం కోసమే నేను ఈ మాట అడిగాను. నువ్వు నీ మాటయందు నిలబడెదవు గాక” అని ఆశీర్వదించిన పిమ్మట “నాయనా! ఈ రాత్రికి నా ఆతిధ్యాన్ని స్వీకరించు” అన్నాడు. అప్పుడు భరతుడు “మీరు నాకు అర్ఘ్యం, పాద్యం ఇచ్చారు. నాకు ఇంతకన్నా ఏమి కావాలి? నాకు ఏమీ వద్దు అన్నాడు”. మరి ‘నీ సైన్యాన్ని ఎక్కడ పెట్టావు?’ అని భారద్వాజుడు అడుగగా, ‘ సైన్యాన్ని ఇక్కడికి తీసుకువస్తే ఆశ్రమం పాడవుతుందని వాళ్ళని దూరంగా పెట్టాను’ అని భరతుడు అన్నాడు. అప్పుడు భారద్వాజుడు “అంత దూరంగా ఎందుకు పెట్టావయ్యా? ఇవాళ నేను ఆతిధ్యం ఇవ్వాలని అనుకుంటున్నాను. కావున నువ్వు నా ఆతిధ్యాన్ని తీసుకొని వెళ్ళాల్సిందే. నీ గుఱ్ఱాలకి, ఏనుగులకి, ఒంటెలకి, సైన్యానికి, పురోహితులకి, మంత్రులకి, నీ తల్లులకి ఎటువంటి ఆతిధ్యం ఇవ్వాలో అటువంటి ఆతిధ్యం ఇస్తాను” అన్నాడు. అప్పుడా భారద్వాజ మహర్షి ఆచమనం చేసి విశ్వకర్మని, త్వష్టని ప్రార్ధన చేసి “ఇక్కడికి రాజకుమారులైన భరత శత్రుఘ్నులు వచ్చారు. వారి వెనకాల సేనాబలం వచ్చింది. పురోహితులు, మహర్షులు వచ్చారు. వీళ్ళల్లో ఎవరెవరు ఎటువంటి భవనములలో నివసిస్తారో అటువంటి భవనములను ఓ విశ్వకర్మా! నువ్వు నిర్మించెదవుగాక.” *(రాజులు నివసించేవాటిని హర్మ్యములు, బాగా డబ్బున్నవారు ఉండేవాటిని ప్రాసాదములు అని అంటారు).* విశ్వకర్మ ఉత్తరక్షణంలో ఎవరికి కావలసిన భవనాన్ని వాళ్ళకి నిర్మించాడు. *శ్రీమద్రామాయణం – అయోధ్యకాండ – 95 – సంపూర్ణం*

*శ్రీమద్రామాయణం* *అయోధ్యకాండ – 96* తరవాత ఆయన కుబేరుడిని, బ్రహ్మగారిని ప్రార్ధన చేసి “కుబేరా! నీ వద్ద ఉన్న వేలమంది అప్సరసలని పంపించు. ఓ బ్రహ్మదేవా! నీ వద్ద ఉన్న అప్సరసలని కూడా పంపించాలి. వారితో పాటుగా నారదుడు, తుంబురుడు, హుహు అనే దేవగాయకులు రావాలి. అలాగే ఇక్కడ పాయసం ఏరులై ప్రవహించాలి. పులియ పెట్టిన పండ్లనుంచి, పిండి నుంచి, బెల్లం నుంచి పుట్టిన కల్లు (సుర) ఇక్కడ నదులుగా ప్రవహించాలి. ఏనుగులు, గుర్రాలు, ఒంటెలు తినడానికి కావలసిన ఆహారం గుట్టలు గుట్టలుగా పడిపోవాలి. పర్వతాలలా అన్నపురాసులు ఏర్పడాలి. వాటితో పాటు కూరలు, పచ్చళ్ళు, పులుసులు కావాలి. ఇవన్నీ తిన్నాక జీర్ణం అవ్వడానికి శొంఠి, లవంగం, ఇంగువ కలిగిన యవ్వనపు పెరుగు కావాలి. ఆకలి పుట్టించడానికి కొంచెం పుల్లగా ఉన్న పెరుగు కావాలి. అన్నంలో కలుపుకోడానికి కమ్మగా ఉన్న పెరుగు పుట్టాలి. వీటితో పాటు అందరూ మొహం కడుక్కోవడానికి చూర్ణములు కావాలి. వంటికి, జుట్టుకి రాసుకునే ఆమలకం (ఉసిరికాయలతో చేసిన ముద్ద), సున్నిపిండి, నూనె మొదలైనవి మంచి మంచి బంగారు పాత్రలలో కావాలి. కొన్ని వేల మంది అప్సరసలు వచ్చి, ఒక్కొక్క సైనికుడిని పీఠం మీద కూర్చోబెట్టి ఒళ్ళంతా నూనె రాసి, నలుగు పెట్టి స్నానం చేయించాలి. ఇక్కడున్న వాళ్ళలో బాగా గెడ్డాలు పెంచుకున్న ఋషులు, బ్రాహ్మణులు ఉన్నారు. వారు గెడ్డం దువ్వుకోడానికి మంచి దువ్వెనలు రావాలి. వీళ్ళు ఇవన్నీ తిన్నాక ఇంకా తినాలనిపిస్తే, తొందరగా జీర్ణం అవ్వడానికి ఔషధాలు కావాలి. అందుకని ఓ సోముడా! చంద్రుడా! మీరు ఇవి సిద్ధం చెయ్యండి. అప్సరసలు నాట్యం చెయ్యాలి. ఇప్పటికిప్పుడు ఇక్కడ పెద్ద పండ్లతో వెలగ చెట్లు, పనస చెట్లు పుట్టాలి. ఎక్కడెక్కడినుంచో చిలుకలు రావాలి. కుబేరుడి రథమైన చైత్రరథం రావాలి. మామిడి చెట్లు పుట్టాలి. కుంకుడు చెట్లు పుట్టాలి. వీటితో పాటు ఎవరికి ఎంత వేడి కావాలో, అంత వేడితో నీళ్ళు పుట్టాలి. అందరికి కట్టుకోవడానికి బట్టలు, తొడుక్కోవడానికి చెప్పులు కావాలి. భరతుడి కోసం ఒక బ్రహ్మాండమైన హర్మ్యం ఏర్పడాలి” అని ప్రార్ధించాడు. ఆయన ఆజ్ఞ మేఱకు అప్పటికప్పుడు కోరినవన్నీ అక్కడ ప్రత్యక్షమయ్యాయి. అప్పుడా గుఱ్ఱాలు, ఏనుగులు తమ జీవితంలో తిననటువంటి భోజనం చేశాయి. ఒక్కక్కడికి నలుగురు అప్సరసలు నలుగు పెట్టి స్నానం చేయించారు. భరతుడు తన మంత్రులతో కలిసి ఆ హర్మ్యంలోనికి ప్రవేశించాడు. అందులో ఒక పెద్ద వేదిక, దాని మీద కనకపు సింహాసనం, దాని మీద ఒక పెద్ద గొడుగు ఉన్నాయి. లోపలికి వెళ్ళిన భరతుడు ఆ సింహాసనం మీద రాముడు కూర్చున్నట్టు భావించి, కిందన ఉన్న పాదపీఠానికి తల తగిలేటట్టు నమస్కారం చేసి, చామరాన్ని ఒకసారి విసిరి, ఇవన్నీ రాముడికి చెందవలసినవి అని, మంత్రి కూర్చునే చోట కూర్చున్నాడు. *శ్రీమద్రామాయణం – అయోధ్యకాండ – 96 – సంపూర్ణం*

*శ్రీమద్రామాయణం* *అయోధ్యకాండ – 97* అప్పుడా సభలోకి రంభ మొదలైన వారు వచ్చి నాట్యం చేశారు. అలాగే నారదుడు, తుంబురుడు మొదలైన వారు వచ్చి పాటలు పాడారు. ఏదన్నా తాగడానికి ఉంటే బాగుండును అని భరతుడు అనుకున్నాడు. అంతే, వెంటనే అక్కడ ఒక పాయసపు నది ప్రవహించింది. అందరూ ఆ నది నుంచి ఎంత కావాలో అంత పాయసాన్ని బంగారు పాత్రలలో ముంచుకొని తాగారు. అందరూ అన్నిటినీ బాగా అనుభవించారు. సైనికులందరూ బాగా తినేసి, తాగేసి పడుకుంటే అప్సరసలు వచ్చి వాళ్ళ కాళ్ళు పట్టారు. అప్పుడా సైనికులు “మనం వెనక్కి అయోధ్యకి వెళ్ళవద్దు. ముందు చిత్రకూట పర్వతాలకీ వద్దు. ఇక్కడే భారద్వాజ ఆశ్రమంలో ఉండిపోదాము” అని సంతోషంతో కేకలు వేస్తున్నారు. ఏనుగులు, గుర్రాలు కూడా ఆనందపడ్డాయి. మరునాడు తెల్లవారే సరికి అన్నీ అదృశ్యమయిపోయాయి. తరువాత భరతుడు, కౌసల్య, సుమిత్ర, కైకేయ వచ్చి భారద్వాజ మహర్షి పాదాలకి నమస్కారం చేశారు. అప్పుడు భారద్వాజుడు భరతుడిని దగ్గరికి పిలిచి “వీళ్ళు ముగ్గురూ మీ అమ్మలు కదా, వీళ్ళల్లో ఎవరు ఎవరో నాకు చెప్తావా” అని అడిగాడు. అప్పుడు భరతుడు కౌసల్యాదేవి చెయ్యి పట్టుకొని ఈమె మా అన్న శ్రీరామచంద్రుడిని కన్నతల్లి. వీరులు, పరాక్రమవంతులు అయిన లక్ష్మణ శత్రుఘ్నులను కన్నతల్లి సుమిత్ర ఈమె. రాముడు అరణ్యవాసానికి వెళ్ళడానికి కారణమైనది, కట్టుకున్న భర్త మరణించడానికి కారణమైన దుష్టచరిత్ర కలిగినటువంటిది, ఎప్పుడూ కోరికలు కోరుతూ, క్రోధంగా ఉండేటటువంటిది అయిన ఈమె నాతల్లి కైకేయ” అని అన్నాడు. అప్పుడు భారద్వాజుడు “ఈవిడ రాముని యొక్క అరణ్యవాసమునకు కారణమైన మాట వాస్తవమే. కానీ రాముడు అలా అరణ్యవాసానికి వెళితే తప్ప దేవతలకి, ఋషులకి రక్షణ అనేది కలగడం జరుగదు. అలా రాముడు అరణ్యవాసానికి వెళ్ళేటట్టు దేవతలు కైకేయ చేత పలికించారు. అందుచేత నువ్వు ఇంక ఎన్నడూ కైక యందు దోషం పట్టకు” అన్నాడు. భారద్వాజుడి మాటలు విన్న భరతుడు “సరే మీరు చెప్పినట్టే ప్రవర్తిస్తాను. రాముడు ఎక్కడున్నాడో మీరు మాకు సెలవియ్యండి” అన్నాడు. “ఇలా దక్షిణాభి ముఖంగా వెళ్ళి నైరుతికి తిరిగితే, అక్కడ ఒక ఇరుకైనటువంటి దారి వస్తుంది. అందులోనుంచి జాగ్రత్తగా ఏనుగుల్ని, గుఱ్ఱాలని నడిపించుకుంటూ వెళ్ళితే, అక్కడ చిత్రకూట పర్వతం మీద మందాకినీ నది పక్కన రాముడు ఆశ్రమాన్ని నిర్మించుకొని ఉన్నాడు” అని భారద్వాజ మహర్షి చెప్పారు. అందరూ భారద్వాజ మహర్షి చెప్పిన విధంగా రాముడిని చేరుకోవడానికి బయలుదేరారు. ఈలోగా ఆ చిత్రకూట పర్వతం వద్ద రాముడు మందాకిని నది యొక్క ప్రవాహాన్ని సీతమ్మకి చూపిస్తూ “సీతా! నువ్వు, లక్ష్మణుడు నా ప్రక్కన ఉండగా, ఈ నదిలో స్నానం చేస్తూ, ఈ వనాలని, ఈ వనంలోని మృగాల అందాలని, ఇక్కడి పర్వతాల్ని చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది. నాకు అయోధ్య జ్ఞాపకం రావడం లేదు. 14 సంవత్సరాలు చిటికెలో గడిచిపోతాయి అనిపిస్తుంది” అన్నాడు. అప్పుడు లక్ష్మణుడు, తాను వేటాడి తీసుకువచ్చిన జంతువు మాంసాన్ని కాల్చి రాముడికి తినమని ఇచ్చాడు. రాముడు దాన్ని తిని, ‘ఇది చాలా బాగుంది, సీతా నువ్వు కూడా తిను’ అన్నాడు. అలా తాను తెచ్చిన మాంసాన్ని సీతారాములు భుజిస్తుండగా, చూస్తున్న లక్ష్మణుడు పొంగిపోయాడు. అన్నావదినలని సంతోష పెట్టానని, వారు పొందుతున్న ఆనందాన్ని చూసి తాను ఆనందపడ్డాడు. *శ్రీమద్రామాయణం – అయోధ్యకాండ – 97 – సంపూర్ణం*

#96 #97 #శరమదరమయణఅయధయకడ65

0 views0 comments

Recent Posts

See All

Ramayana: History or mythology? 1) The Ramayana is one of two epics, the other being the Mahabharata, which have had a crucial influence in shaping the nature of Indian civilization. The Ramayana exis

*శ్రీమద్రామాయణం* *అరణ్యకాండ – 45* రామలక్ష్మణులు కబంధుడి శరీరాన్ని చితి మీద పెట్టి కాల్చేశారు. అప్పుడు ఆ చితి నుండి ఆభరణములు ధరించి, మంచి తేజస్సుతో, ఒక దివ్య శరీరంతో ధనువు పైకి వచ్చి “రామా! ఇప్పుడు

*శ్రీమద్రామాయణం* *అరణ్యకాండ – 43* అప్పుడు రాముడు “చూశావా లక్ష్మణా! రావణుడు సీతని బలవంతంగా అపహరించుకుపోతుంటే, తన ప్రాణాలను అడ్డుపెట్టి ఈ పక్షి సీతని కాపాడే ప్రయత్నం చేసింది. మనం ఆలోచించి చూస్తే, ధర

bottom of page