మానవున్ని నరకం నుండి తప్పించేవి వృక్షాలు, Helping Trees for Human Being from Narakam
మానవున్ని నరకం నుండి తప్పించేవి వృక్షాలు Helping Trees for Human Being from Narakam
మానవున్ని నరకం నుండి తప్పించేవి వృక్షాలు
మానవుణ్ణి నరకం నుండి తప్పించేవి కూడా వృక్షాలే అని “శ్రీ వరాహా పురాణం“ (172వ అధ్యాయం, 36 వ శ్లోకం) పేర్కొంది.
శ్లోకం :- అశ్వత్ధ మేకం, పిచుమంధ మేకం, స్య గ్రోధమేకం, దశ పుష్ప జాతీం ı
ద్వే ద్వే తధా దాడిమ మాతులింగే పంచామ్ర వాపీ నరకం న యాతీ ıı
ఒక రావి చెట్టు, ఒక నిమ్మ చెట్టు, ఒక మఱ్ఱి చెట్టు, రెండు దానిమ్మ చెట్లు, రెండు మాధీ ఫలపు చెట్లు, అయిదు మామిడి చెట్లు, పది పూల చెట్లు వేసినవాడు నరకానికి వెళ్ళడు.
పెంచిన మొక్కలే పుట్టే బిడ్డలు
మనం మొక్కలు నాటి, ఆ మొక్కలను జాగ్రత్తగా పెంచి పోషిస్తే అవే పునర్జన్మలో మనకు సంతానంగా మారతాయని హిందూ దర్మశాస్త్రాలు పేర్కొంటున్నాయి. అలాగే వృక్షాలను దానం చేయటం కూడా పుణ్యాన్ని అందించే దానాల్లో ఒకటి.
వృక్షాల గురించి ఋగ్వేదంలో ఇలా ఉంది.
శ్లోకం :- మా కాకమ్బీరముద్ వృహో వనస్పతి మశస్తీర్వి హి నీనశః ı
మోత సూరో ఆహా ఏదాచన గ్రీవ ఆదధతే వేః ıı
ఇతర పక్షులు పీకలు పట్టుకొని, వాటిని చంపివేసే డేగ జాతి పక్షిలాగా ఉండకండి. వృక్షాలను బాధించకండి. మొక్కలను పెకలించటం కాని, వాటిని నరికి వేయటం కాని చేయకండి, జంతువులకు, పక్షులకు ఇతర జీవరాసులకు అవి రక్షణ కల్పిస్తాయి అని పేర్కొనటం జరిగింది.
వృక్షాలకు సైతం సంతోషం, దుఃఖం లాంటి మానవ సహజమైన లక్షణాలు ఉంటాయి. గతజన్మలో చేసిన పాప పుణ్యాల తాలూకు ఫలితాలనే ఈ జన్మలో వృక్షాలు అనుభవిస్తుంటాయని “మనుస్మృతి” పేర్కొంటుంది. మానవాళి సంతోషం కోసమే దేవుడు వృక్షాలను సృష్టించాడు. ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ ఉండే ఈ వృక్షాలు మనుషులను మాత్రం ఈ ఎండ, వానల నుండి కాపాడతాయి. మహర్షులు సైతం వృక్షాల నీడనే గాఢమైన ద్యానంలో మునిగి తపమాచరించారని పురాణాల్లో చదివాం. నరకప్రాయాన్ని తప్పించుకోవటం కోసం, జీవితంలో దుఃఖాన్ని పోగొట్టి, ఆశాభావాన్ని రేకెత్తించటం కోసం వృక్షాలను నాటి, పెంచి పోషిద్దాం.