మాండూక్యోపనిషత్తు
—————————– మాండూక్యోపనిషత్తు ఏ వేదంలో ఉంది? మాండూక్యోపనిషత్తు అథర్వణ వేదంలోనిది.
మాండూక్యోపనిషత్తు అనే వచ్చింది? ఇందులో చెప్పబడిన విషయాలు సామాన్య క్రమ పద్ధతిలో గాక, కప్ప(మండూకము) గంతులు వేసినట్లుగా అనిపిస్తాయి గనుక ఈ ఉపనిషత్తుకు మాండూక్యోపనిషత్తు అని పేరు వచ్చింది.
ఈ ఉపనిషత్తులో ఎన్ని మంత్రాలు వున్నాయి?
ఈ ఉపనిషత్తులో 12 మంత్రాలు ఉన్నాయి. అతి క్లుప్తంగా ఉండడం వలన అర్థం చేసుకోవడం కష్టమని శ్రీ గౌడపాదులు దీనిపై నాలుగధ్యాయాల కారికలు వ్రాశారు. *************************
ఈ ఉపనిషత్తు యొక్క విశిష్టత ఏమిటి?
ఈ ఉపనిషత్తు చదివితే చాలు, మోక్ష మార్గం సులభం అవుతుందని వ్యాఖ్యాతల అభిప్రాయం.
అవస్థాత్రయ అవగాహన ద్వారా పరమాత్మ ఉనికిని నిరూపించడం, ఓంకారం పరమాత్మ అనీ, పరమాత్మకు శబ్ద సంకేతమని కూడా వివరించడం ఈ ఉపనిషత్తు యొక్క విశిష్టత.
అథర్వణ వేదానికి చెందిన మహావాక్యం ఈ ఉపనిషత్తులో ఉందంటారు. అది ఏది? “అయమాత్మా బ్రహ్మ” అనే వాక్యం. దీని అర్థం – “ఈ జీవాత్మయే పరబ్రహ్మము” —————————————-
స్వప్నావస్థలో జీవుడు పొందే ఆనందం ఎటువంటిది?
జాగ్రదావస్థలో ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి పని చేస్తూ ఉంటాయి; స్వప్నావస్థలో మనస్సు తన పని తాను చెయ్యడమే కాక, ఇంద్రియాల పని కూడా చేస్తుంది;
సుషుప్తిలో మానసిక వృత్తులు కూడా పని చెయ్యవు గనుక, జీవుడు అవిద్య యొక్క ఆధీనంలో ఉండి ఆనందానుభూతిని పొందుతాడు.
అయితే అది శాశ్వతానందం కాదు. మేల్కొన్న తర్వాత అంతా మామూలే.
ఈ ఉపనిషత్తు అందించే ప్రధాన సందేశం ఏమిటి?
మనం స్వప్న,సుషుప్తుల నుండి మేల్కొన్న తరువాత స్వప్న విశేషాలు, ఆనందం జ్ఞప్తికి తెచ్చుకునిచెప్పగలుగుతున్నాం
అంటే ఈ అవస్థలకు దేనికి గురికాని తత్వం ఒకటి సాక్షీభూతంగా ఉందన్న మాట. అదే జీవుడు.
ఈ మూడవస్థలూ దాటిన తర్వాత జీవుడు చేరేది తురీయావస్థ. ఇది సమాధి స్థితి. అనిర్వచనీయమైన ఈ అవస్థలో అవిద్య నశించి సంపూర్ణ జ్ఞానానందం కలుగుతుంది. ఈ తురీయుడే ఓంకారం అంటుందీ ఉపనిషత్తు.
కల నుండి మేల్కొన్న తరువాత అది నిజం కాదని మనకు తెలుస్తుంది. అలాగే ఈ జీవితం ఒక పెద్ద కల. మోక్షప్రాప్తితో ఇది నిజం కాదని తెలుస్తుందని ఈ ఉపనిషత్తు ప్రధాన సందేశం. —————————————-
ఓంకారం (ప్రణవం) యొక్క విశిష్టత ఏమిటి?
‘ఓమిత్యేతదక్షరమిదగ్ం సర్వం!'(1) ఈ ప్రపంచంలో ఏ వస్తువునైనా సూచించాలంటే ఒక పదంతో సూచిస్తాం. పదం శబ్ద స్వరూపం. పదం చేత సూచించబడేది పదార్ధం, అనగా వస్తువు.
అందుచేత పదానికి పదార్థానికి – అంటే వాచకానికి, వాచ్యానికి అభేదమని పెద్దలు సూచించారు.
ఈ ప్రపంచంలో కనబడే వస్తువుకి, కనబడని వస్తువుకి కూడా ఒక శబ్దసంకేతం ఉండాలి. అలాంటి శబ్దసంకేతమే ‘ఓం’. ఈ దృశ్యమాన విశ్వానికంతా ‘ఓం’ అనేది శబ్దసంకేతమ్.
అలాగే పరబ్రహ్మమ్ కూడా ఓంకారము చేతనే తెలియబడుచున్నది. ఓంకారాన్ని ప్రణవమని కూడా అంటారు. ఇది హిందూమతానికి మరియు భారతదేశంలో పుట్టిన జైన, బౌద్ధ, సిక్కు మతాలకు శబ్ద సంకేతంగానూ, పరమాత్మ సూచకంగానూ అతి పవిత్రమైనదిగా పరిగాణించబడుతూ ఉంది.
స్వరమూ ఓంకారమే అనే ఈ మంత్రంతో ఈ ఉపనిషత్తు ప్రారంభం అవుతుంది. —————————————-
‘ఆత్మయే బ్రహ్మము’ అని సూచించే మహావాక్యం ఏది?
‘అయమాత్మా బ్రహ్మ’ అనే వాక్యం జీవాత్మ, పరమాత్మల ఏకత్వాన్ని సూచించే అథర్వవేదానికి చెందిన మహావాక్యం.
పరమాత్మ అనంతుడు (infinite). జీవుడు శరీరంలో చేరినపుడు మనో బుద్ధులకు చేరువవడం వలన, జీవుడు తాన బ్రహ్మం కంటే వేరు అనుకొనే ప్రమాదం ఉంది. దీన్ని ఉపాధి దోషం అంటారు. ఈ భావన సరైంది కాదని చెప్పటానికి ఆత్మయే బ్రహ్మము – రెండూ ఒకటే అని ఈ మహావాక్యం ఉపదేశిస్తుంది.
అంతే కాకుండా జీవునికి, జాగ్రదావస్థ, స్వప్నావస్థ, సుషుప్త్యావస్థ, తురీయావస్థ అనే నాలుగు అవస్థలు ఉంటాయి. ఈ నాలుగు అవస్థలు జీవుని నాలుగు పాదాలని, అన్ని పాదాలలోనూ ఉండేది ఆత్మ అని, జీవాత్మకు, పరమాత్మకు చైతన్యాంశ లో భేదం లేదని ఈ మహావాక్యం సూచిస్తుంది. —————————————-
‘వైశ్వానరుడు’ అంటే ఎవరు?
మనకు కనిపించే ప్రపంచం దృశ్య జగత్తు. చూచేవాడు ద్రష్ట – ఈయనే జీవుడు. ఈయనకు నాలుగు పాదాలని ఉపనిషత్తు చెపుతుంది. ప్రథమ పాదం వైశ్వానరుడు.
స్థూలభుగ్ వైశ్వానరః ప్రథమపాదః (3)
ఈయన బాహ్య ప్రపంచంలోని విషయాలను గ్రహించి మనస్సుకు అందజేస్తాడు. మనస్సు బుద్ధికి నివేదిస్తే, బుద్ధి నిర్ణయం ప్రకారం కర్మేంద్రియాలతో క్రియలను చేస్తాడు.
ఈయన మెలకువగా నున్నప్పుడు పనిచేసేవాడు గనుక వైశ్వానరుడని, విశ్వుడని పిలువబడతాడు – అంటే ఈ విశ్వం లోని స్థూల విషయాలను గ్రహించేవాడని అర్థం. ————————————–
‘తైజసుడు’ అంటే ఎవరు?
‘స్వప్నస్థానో అంతః ప్రజ్ఞః (4) స్వప్నావస్థలో అంతః ప్రజ్ఞ తో సంచరించేవాడు అని దీని అర్థం. స్వప్నావస్థలోని జీవుణ్ణి ‘తైజసుడు’ అంటారు.
అంటే జాగ్రదావస్థ లోని స్థూల శరీరంతో కాకుండా తేజోమూర్తుడై ఉంటాడు. జ్ఞానేంద్రియ, కర్మేంద్రియాలు పని చెయ్యవు. మనస్సు మాత్రమే పనిచేస్తుంది.
ఇది స్వప్నావస్థ. స్వప్నాలను చూస్తూ ఉంటాడు. మరి స్వప్నంలో చూడడం, నడవడం, మాట్లాడడం, వినడం జరుగుతున్నాయిగా. మరి ఇవన్నీ ఏ విధంగా జరుగుతున్నాయి?
అనే ప్రశ్నకు జ్ఞానేంద్రియ కర్మేంద్రియాల పనులన్నీ మనస్సే చేస్తుందని సమాధానం. ఇది జీవుని రెండవ పాదం. —————————————-
‘ప్రాజ్ఞుడు’ అంటే ఎవరు?
యత్ర సుప్తో న కంచన కామం కామయతే న కంచన స్వప్నం పశ్యతి, తత్ సుషుప్తమ్ (5)
నిద్రించినప్పుడు ఏ విధమైన కోరికలూ ఉందని స్థితిని సుషుప్తి అంటారు. గాఢనిద్రలో మనస్సు కూడా పనిచెయ్యదు.
ఈ అవస్థలో కేవలం అనిర్వచనీయమైన ఆనందానుభూతి మాత్రమె ఉంటుంది. జీవున్ని ఈ స్థితిలో ‘ప్రాజ్ఞుడు’ అంటారు. ఇది జీవుని మూడవ పాదం. —————————————-
‘తురీయుడు’ అంటే ఎవరు?
‘అమాత్రశ్చతుర్థో2 వ్యవహార్యః ప్రపంచోపశమః శివో2 ద్వైత, ఏవమోంకార ఆత్మైవ (12)
‘అ’, ‘ఉ’, ‘మ’ అనేవి మూడు మాత్రలు, అనగా, అంశాలు. ఈ మూడు కలిస్తే ‘ఓం’ అవుతుంది. జాగ్రత్, స్వప్న, సుషుప్తి అనే మూడు అవస్థలు ఓంకారంలోని ‘అ’, ‘ఉ’, ‘మ’ అనే మూడు అంశాలు.
ఈ మూడు అంశాలు లేనిదే ఈ నాల్గవ అవస్థ అయిన తురీయావస్థ. ఇది జీవుని నాల్గవ పాదం. ఈ అవస్థలో వ్యవహారం గాని, జగత్తుతో సంబంధం గాని ఉండవు.
ఈ స్థితిలో కేవలం పరమానందంతో పరమాత్మలో ఐక్యం అవడం అని అద్వైతులు, పరమాత్మ సన్నిధిలో వైకుంఠంలో ఉండటం అని విశిష్టాద్వైతులు, ద్వైతులు అంటారు.
*************************
గౌరవనీయులై జగదీశ్వరి శ్రీ జేజి శర్మ గారి పోస్టు