నాగులు – సర్పాలు :
మనదేశంలో నాగుపాములను నాగదేవతలుగా పూజిస్తారు. అందుకే దానిచుట్టూ కొన్ని సంప్రదాయాలు, ఆచారాలు వచ్చాయి. కాని మన శాస్త్రాల ప్రకారం నాగులు, సర్పాలు ఒకటి కావు. నాగులు వేరు, సర్పాలు వేరు. భగవద్గీతలో శ్రీ కృష్ణపరమాత్మ చెప్పినదానిని పరిశీలిస్తే.. ‘నేను ఆయుధాలలో వజ్రాన్ని. గోవులలో కామధేనువుని. సర్పాలలో వాసుకిని, నాగులలో అనంతుడిని అంటాడు.
వాసుకి శివుడిని ఆశ్రయించి ఆయనకు అలంకారంగా వుంటుంది. ఈ వాసుకినే త్రాడు గా చేసుకుని సాగర మధనం చేశారు దేవదానవులు. వాసుకి, అనంతుడు ఇద్దరూ కద్రువ తనయులు. అనంతుడు అనగా ఆదిశేషుడు… కద్రువకు పెద్ద కొడుకు. బ్రహ్మ అనంతుడి బలాన్ని చూసి భూభారాన్ని మోయమని చెబుతాడు. పురాణాల ప్రకారం అనంతుడు అదృశ్యంగా ఈ భూతలాన్ని మోస్తూ ఉంటాడు. ఈ అనంతుడే వివిధ అవతారాలలో స్వామివారిని అనుసరిస్తాడు.
ఇక్కడే ఓ సందేహం వస్తుంది. విష్ణుమూర్తేమో.. సర్పాలలో వాసుకిని తానేనన్నాడు, ఇక్కడ నాగులలో అనంతుడిని అంటున్నాడు. అసలు సర్పాలు , నాగులు ఒకటి కాదా ? ఏమిటి వీటి మధ్య తేడా అన్న అనుమానం వస్తుంది. కొంతమంది పండితుల చెప్పినదాని ప్రకారం… సర్పాలంటే విషపూరితాలు అని , నాగులు అంటే విషరహిత పాములు అని ప్రతిపాదించారు. కానీ పురాణాల ప్రకారం సర్పాలు, నాగులు సోదర సమానులైనా రెండింటికీ చాలా తేడా ఉంది.
నాగులు కామరూపధారులు. అవి కావాలనుకున్నప్పుడు మానవ రూపంలో కనబడగలవు. మానవరూపాన్నే కాదు, ఏ రూపాన్నయినా ధరించగలవు. సర్పాలు అలా కావు, అవి నేలను అంటిపెట్టుకుని పాకుతాయి. భూమి మీదే తిరుగాడుతాయి. నాగులకు ఒక విశిష్టత వుంది. అవి గాలిని ఆహారంగా స్వీకరించి బ్రతుకుతాయి. సర్పాలు మాత్రం.. కప్పలు మొదలైన జీవరాశులను ఆహారంగా తీసుకుంటాయి.
నాగుల్లో మళ్ళీ 9 జాతులు ఉంటాయి. అట్లాగే సర్పాల్లో కూడా దేవతా సర్పాలని ప్రత్యేకంగా ఉంటాయి. దేవతాసర్పాలు ఎక్కడ ఉంటే అక్కడ మల్లెపూలవాసన వస్తుందంటారు. కానీ ఇవి మనుషులు తిరిగే ప్రాంతాల్లో సంచరించవు, మానవజాడలకు దూరంగా ఉంటాయి. దేవతా సర్పాలకు కూడా కొన్ని శక్తులు ఉంటాయి, అవి కొన్ని ప్రత్యేకమైన క్షేత్రాల్లో ఇప్పటికీ ఉన్నాయని చాలామంది నమ్ముతారు. అవి పాలు త్రాగుతాయి. పూర్వకాలంలో ప్రజల భక్తికి మెచ్చిన నాగదేవతలు అనేకరూపాల్లో వారికి దర్శనమిచ్చి పూజలు అందుకునేవారంటారు. భక్తుల కోరిక మేరకు ఆరోగ్యాన్ని, సంతానాన్ని అనుగ్రహించేవంటారు. సినిమాల్లో చూపించినట్లు.. మనిషికి గానీ, పాములు పట్టేవాళ్ళకు గానీ అవి చిక్కవు. అసలు వీటి ఉనికిని కనుగొనడం మామూలు మానవుల తరం కాదు.
కాలచక్రంలో తిథులు ప్రారంభమైన సమయంలో నాగులు కూడా మానవజాతితో కలిసి సంచరించేవి. అప్పటి మనుషులకు ధర్మనిష్ఠ, సత్యనిష్ఠ, దైవభక్తి ఎక్కువగా ఉండేవి. ఆ రోజులు వేరు. అందుకే అప్పట్లో నాగజాతికి పాలు, పండ్లు సమర్పించి, పసుపు కుంకుమలు, సారెలతో పూజించి, వారిని సంతోషపెట్టేవారు. క్రమ క్రమంగా ప్రజల్లో ధర్మంపై శ్రద్ధ తగ్గిపోయింది. అందుకే నాగులు ఇంతకముందులా సశరీరంతో సంచరించడం మానేశాయంటున్నారు పండితులు.
దాదాపు 75 ఏళ్ళ క్రితం వరకు దేవతా సర్పాలను చూసి, పూజించి వరాలను పొందిన కుటుంబాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు సదాచారం, ధర్మం వంటి మంచి విషయాలను జనం వదిలేస్తున్నారు. ఒకవేళ ఇటువంటి ఆచారాలు ఇప్పటికీ పాటిస్తున్నా అత్యంత నిష్టంగా పాటించే వారు అరుదుగా కనిపిస్తున్నారు. దాంతో దేవతాసర్పాలు జనావాసాలకు దూరంగా వెళ్ళిపోయాయి. పూజల్లో లోపాల వల్ల కొన్ని.. శరీరాలను విడిచిపెట్టాయి. ఇక పుట్టల్లో ఉండేవి దేవతా సర్పాలని చెప్పలేం. చాలావరకు మాములు పాములే జనావాసాల మధ్య పుట్టల్లో ఉంటున్నాయి. వీటిని ఎట్టిపరిస్థితుల్లోనూ హింసించకూడదు. ఇలా చేస్తే.. దేవతాసర్పాలు, నాగజాతి అనుగ్రహం పొందవచ్చంటున్నారు పండితులు.
🌺🙏🙏🙏🙏🙏🌺